కడప ఎస్పీకి YS.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత లేఖ
మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు.
ఈ నెల 10న మణికంఠరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి వద్ద తన కుటుంబ సభ్యులు టార్గెట్ గా రెక్కీ నిర్వహించారని ఫిర్యాదులో వెల్లడించారు.
మణికంఠరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి అనుచరుడిగా సునీత పేర్కొన్నారు. కార్యాలయంలో ఎస్పీ లేకపోవడంతో సిబ్బందికి సునీత లేఖ అందజేశారు.
ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్ తరువాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్స్చేశాడని లేఖలో సునీత వెల్లడించారు.
శివశంకర్రెడ్డి బర్త్ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు.
తన తండ్రి హత్యకేసులో శివశంకర్రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు.