గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందచేశారు. వెంకట్రావ్ ను పరిమి అజయ్ కుమార్, కొల్లా ఆనంద్ లు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. యార్లగడ్డకు డమ్మీ అభ్యర్థిగా వెంకట్రావ్ సతీమణి జ్ఞానేశ్వరి గురువారం ఉదయం నామినేషన్ వేశారు.
ఆమె ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో కూటమి నాయకులు కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరంలో మెజార్టీ వైసీపీ శ్రేణులు, గన్నవరం అభివృద్ధిని కాంక్షించే తటస్థులు తనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్న నమ్మకాన్ని యార్లగడ్డ వ్యక్తం చేశారు. కాగా ఈనెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు కుటమి నాయకులు, కార్యకర్తలు భారీ జనసందోహం నడుమ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.