రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎజెండా ఇప్పుడు మరో వివాదానికి కేంద్ర బిందువు అయింది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం, అజెండా ను కూడా ఖరారు చేసింది. మొదట అజెండా లో 9 అంశాలు ఉన్నాయి. అవి:
1. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
2.ఏపీ, తెలంగాణ మధ్య వినియోగ సమస్యపై పరిష్కారం
3.పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
4.రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
5. APSCSCL, TSCSCL మధ్య నగదు ఖాతాల విభజన
6 ఏపీ – తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
7.ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జిల్లాల ప్రత్యేక గ్రాంటు
8.ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా
9. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు
ఈ నెల 17న రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగాలని నిర్ణయించారు. అంత వరకూ బాగానే ఉన్నది.
అజెండాలో 8 వ అంశం గా ప్రత్యేక హోదా ను ప్రస్తావించారు. దాంతో అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగిరి గెంతేసింది. తాము గట్టిగా అడగకపోయినా కేంద్రం ప్రత్యేక హోదా విషయాన్ని చర్చల్లో ప్రస్తావించడంపై వైసీపీ హర్షం వ్యక్తం చేసింది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయాన్ని ఏ మాత్రం ప్రభావితంగా అడగలేకపోయింది.
రెండు మూడు రోజుల కింద రాజ్యసభలో కేంద్రాన్ని ప్రాధాయపడుతున్నట్లుగా వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదాను కోరారు. అకస్మాత్తుగా త్రిసభ్య కమిటీ చర్చల్లో ఒక అంశంగా ఉండటంతో తాము ప్రస్తావించడం వల్లే అజెండాలో పెట్టారని వైసీపీ నేతలు ప్రకటించేశారు. అంతే కాకుండా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయమని కూడా వైసీపీ నేతలు చెప్పేశారు.
అయితే సాయంత్రానికి సీన్ రివర్స్ అయింది. అజెండాలో మార్పులు చేసింది.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా పోయింది. దాంతో దిమ్మ తిరిగిన వైసీపీ నేతలు ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబునాయుడు ఆయన మనుషులులైన బిజెపి నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిలతో కలిసి అజెండాను మార్పించారని విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని మార్పించారని వైసీపీ నేతలు చెప్పడాన్ని వైసీపీ దివాలాకోరుతనంగా తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అనే రెండు అంశాలు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కాదని, కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవేని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. త్రిసభ్య కమిటి రెండు రాష్ట్రాలకు చెందిన అంశాలను మాత్రమే చర్చిస్తుంది కాబట్టి వాటిని అజెండా నుంచి తీసేసినట్లు చెప్పారు. అయినా వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు మార్పించారనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.