అధికార వైకాపా పార్టీ సోషల్ మీడియా పెట్రేగి పోతుందని, సొంత మీడియా ఉన్నా, పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లి ఉన్నది లేనట్లు,లేనిది ఉన్నట్లు చూపించే గోబెల్స్ సిద్ధాంతాన్ని పలు చానళ్ళ ద్వారా తలకెత్తుకుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ ను రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకొని అక్కడ ఉన్న పదుల కొద్ది ఛానళ్ళును, వందల కొద్దీ యూట్యూబ్ చానళ్ళను రంగంలోకి దింపిందని తెలిపారు.
పాత్రికేయులుగా, విశ్లేషకులుగా పనిచేసి అనుభవం ఉన్న కుహనా మేధావులతో బారసాలు కుదుర్చుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈమేరకు పని బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించి, అమరావతి నుంచి వివేకా హత్య వరకు, దళితుల దారుణ మారణ కాండ నుంచి మహిళల మిస్సింగ్ కేసుల వరకు రాజకీయంగా ఎదురు దాడి చేసేలా మీడియాకు శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నట్లు, పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు.
గతంలో అమరావతికి అనుకూలంగా, రైతులకు మద్దతుగా నిలిచిన వారిని సైతం ప్రభుత్వ అనుకూలంగా మార్చారని, వివిధ రాజకీయ పార్టీల మాటున పనిచేసి విశ్లేషకులుగా సమాజం ముందు ఫోజు కొట్టిన పైయిడ్ మేధావులను రంగంలోకి దింపారన్నారు. ఆఖరికి దళితుల సమస్యలను ఎజెండాగా వినిపించే నాలాంటి ఉద్యమకారులను తెలుగుదేశం పార్టీ కీలక నేత అనీ, చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ అంటూ కొత్త పేర్లు పెట్టి విష ప్రచారం చేస్తున్నారన్నారు.
దీనిని ప్రతిపక్షాల సోషల్ మీడియా ధీటుగా తిప్పికొట్టలేకపోతుందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో,వివిధ అధికార పార్టీ ఛానళ్ళలో వస్తున్న వార్తలను ప్రజలే పాలను, నీళ్ళను వేరు చేసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే నిజం నిద్రలేచేలోగా, అబద్ధం ఊరంతా చుట్టేసే ప్రమాదం ఉందని బాలకోటయ్య ప్రజల్ని హెచ్చరించారు.