యోగి వేమన ఆధునిక భావ విప్లవకారుడని హేతువును ఆయుధంగా చేసుకొని అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, కుల మత మూఢత్వాలపై ప్రజలను చైతన్యవంతులను చేసిన సంఘ సంస్కర్త అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా॥ పాపినేని శివశంకర్ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో నేడు జరిగిన ప్రజాకవి యోగి వేమన 371వ జయంతి సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా॥ పాపినేని శివశంకర్ ప్రసంగిస్తూ సి.పి.బ్రౌన్, కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మల కృషి ఫలితంగా వేమన పద్యాలు వెలుగులోనికి వచ్చాయన్నారు.
తెలుగు జాతికి దార్శనికతను అందించిన మహనీయులు యోగివేమన అని కొనియారు. శాసన మండలి సభ్యులు కె.యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ జాతీయ ఉద్యమంలో భాగంగా ప్రారంభమైన సాంస్కృతిక పునర్ధుజీవన ఉద్యమం మరలా మరోసారి రావాలని కోరారు. ప్రజాకవి వేమన పద్యాలు నేటికి సజీవంగా ప్రజల హృదయాలలో వున్నాయన్నారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఎంపిక చేసిన 100 యోగి వేమన పద్యాలను ముద్రించి ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఆటవెలదిలో ప్రతి తెలుగువారికి అర్ధమయ్యే సామాన్య భాషలో యోగి వేమన వేలాది పద్యాలను రచించారని తెలిపారు.
అరసం జాతీయ నేత పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ యోగి వేమన పద్యాలు ప్రజలలో ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించాయని, హేతువాద దృష్టిని అందించాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డా॥ మోదుగుల రవిక్రిష్ణ ప్రసంగిస్తూ పద్య రచనలోకెల్లా మాధుర్యం ఆటవెలదిలో వుందన్నారు. యోగి వేమన ఆధునిక యుగ వైతాళికుడని, ఆధునిక యుగ బుద్ధునిగా వర్ణించారు. హైస్కూలు పాఠ్యాంశాలలో వేమన పద్యాలకు స్థానం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, మానవత ఛైర్మన్ పావులూరి రమేష్, ప్రముఖ సాహితీవేత్త డా॥ వి. సింగారావు, ప్రొఫెసర్ కొండవీటి చిన్నయసూరి, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, ప్రొఫెసర్ డిఎఆర్ సుబ్రహ్మణ్యం, రేట్ పీయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ. నారాయణరెడ్డి తదితరులు ప్రసంగించారు.