రాజ్యాంగ సంస్థలతో పోరాడుతూ రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించడం తప్ప వై ఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం మరేం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
పంచాయితీ ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన అన్నారు.
రాజ్యాంగ పరంగా ఏర్పాటు అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడితో కలిపి తూలనాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయితీ ఎన్నికలంటే భయపడుతున్నారని ఆయన అన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పెద్దవాడో, టీటీడీ బోర్డు చైర్మన్ పెద్దవాడో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం నియమించే టీటీడీ బోర్డు చైర్మన్ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాబాయి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఆయన వెనక నిలబడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపిఐఐసి చైర్ పర్సన్ రోజా, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శనివారంనాడు తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి వెనక నిలబడి ఉండటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలుసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు అందరూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చూసి భయపడుతున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు.