వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో బాటు పాలనా వ్యవహారాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజుకు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించి షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ విధించిన గడువులోపు ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన సమాధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎంపి రఘురామకృష్ణంరాజుపై అదే పార్టీకి చెందిన మంత్రి, శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.
ఈ పరిస్థితుల్లో తనకు భద్రత కల్పించాలని ఎంపి రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలవడం చర్చనీయాంశం అయింది.