ఇండోనేషియాలో విద్యార్థుల విహారయాత్ర విషాదంగా మారింది. యాత్రలో భాగంగా ఇండోనేషియా ప్రధాన ద్వీపమైన జావా ఐలాండ్లో ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులు నదీ తీరం వెంట వెళ్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వరుదల్లో చిక్కుకుని ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.
స్లెమాన్ జిల్లాలోని యోగ్యకర్త ప్రావిన్స్లో నిర్వహించిన స్కౌటింగ్ కార్యక్రమంలో స్థానిక పాఠశాలకు చెందిన 250 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెంపోర్ నదీ తీరం వెంబడి విద్యార్థులు టీచర్లతో పాదయాత్ర చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి ఎగస్ విబోబో మాట్లాడుతూ ప్రసుత్తం జావా ఐలాండ్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవనీ, నదీ తీరం వద్దకు ఎవరూ వెళ్లవద్దని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సెంపోర్ నదిలో వరద ఉధృతి పెరగడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ వరద ప్రమాదంలో ఆరు మృతదేహాలు కనుగొన్నామని స్థానిక మిలటరీ చీఫ్ డియాంటారో పేర్కొన్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న 10 మందితో సహా 239 మంది విద్యార్థులను రక్షించినట్టు ఆయన తెలిపారు.