విజయవాడలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులపై ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ ఆదాయపన్ను శాఖకు మాత్రం పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. విజయవాడలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఐటీ అధికారులు కార్పొరేట్ ఆసుపత్రులపై దాడులు చేయడంతో ఒక్క సారిగా విజయవాడ ఉలిక్కి పడింది. ఆ ఆసుపత్రిలో జరిపిన దాడుల్లో ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్ల పై కొరడా ఎక్కు పెట్టిన ఐ.టి. అధికారులు పట్టుబిగించినట్లయింది. ఉదయం నుండి పది మందికి పైగా ఐటీ అధికారులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.