రేషన్ కార్డ్ లేని జర్నలిస్టులందరికీ కరోనా లాక్ డౌన్ సందర్బంగా ఉచిత రేషన్ అందించేందుకు జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ హామీ ఇచ్చారు.
ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులకు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ మహా విశాఖ నగర శాఖలు సంయుక్తంగా జర్నలిస్టుల నుండి వివరాలు కోరగా 65మంది జర్నలిస్టులు తమకు రేషన్ కార్డ్ లేదని తెలియజేశారు.
వారి ఆధార్ కార్డుల వివరాలు అందచేశారు. ఆయా వివరాలతో కూడిన జాబితాను శనివారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షులు పీ. నారాయణ్, ఏపీబీజేఏ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ఏపీడబ్య్లుజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు జీ. శ్రీనివాసరావులతో కూడిన బృందం జేసీ శివశంకర్ కు సమర్పించింది.
దీనిపై ఆయన మాట్లాడుతూ ఆధార్ వివరాలన్నీ పరిశీలించాక ఒకటి, రెండు రోజుల్లో రేషన్ ఏ డిపోలో తీసుకోనున్న విషయాన్ని తెలియజేస్తామన్నారు. రేషన్ కార్డ్ కోసం నవశకంలో దరఖాస్తు చేసిన జర్నలిస్టులకు ఉచిత రేషన్ ఇస్తామన్నారు.