అదృష్టం ఉంటే అన్నీ కలిసివస్తాయనే నానుడి ఇక్కడ నిజమైందని చెప్పవచ్చు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా.. లాటరీ విధానంతో ఓ ముగ్గురు విజయం సాధించి, తెరాసకు అధికారాన్ని దూరం చేశారు. అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీకి సహకార సంఘం ఎన్నికల్లో అధికారం వెతుక్కుంటూ వచ్చింది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి సహకార సంఘానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు లాటరీతో గెలిచారు. 13 వార్డుల్లో తెరాస-05, కాంగ్రెస్-07, సీపీఐ-01 స్థానాన్ని సాధించాయి. నాలుగో వార్డులో తెరాస అభ్యర్థి నర్ర మల్లేశ్, ముత్తె సత్యనారాయణకు చెరో 50 ఓట్లు వచ్చాయి. ఏడో వార్డులో తెరాస అభ్యర్థి తొంగల రాజేశం, కాంగ్రెస్ అభ్యర్థి నలిమెల రాంచందర్కు 42 ఓట్లు, 8వ వార్డులో తెరాస అభ్యర్థి శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి తొంగల కుమారస్వామికి 53 ఓట్ల చొప్పున రావడంతో.. అధికారులు లాటరీ పద్ధతిలో విజేతలను నిర్ణయించారు. మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడంతో తెరాస నాయకులు విస్మయానికి గురయ్యారు.
previous post