ద్వాపర యుగంలో బలరాముని తో ప్రతిష్ట కావించబడిన దేవతా నిర్మిత పంచ శివాలయాలు పాయకపాడు (ఒరిస్సా), గుంప (విజయనగరం జిల్లా), సంగాం, ఉమారుద్ర కోటేశ్వరాలయం (గుడివీధి ), కళ్లేపల్లి . ఈ మూడు శివాలయాలు శ్రీకాకుళం జిల్లాలో నెలవై ఉన్నాయి. బలరాముడు పరమశివుని ప్రార్థించి వరమును పొంది దేవతా నిర్మిత ఆలయములైన వీటిలో శివుణ్ణి ప్రతిష్టించాడని ప్రతీతి.
ఆ తర్వాత గంగను వేడుకొనగా నాగలితో మార్గము చూపుము ప్రవహిస్తానన్నది. దాంతో బలరాముడు నాగలితో మార్గము చూపాడు. అలా ఏర్పడింది కనుక ఈ ప్రాంతానికి నాగవల్లి అయింది. అదే కాలక్రమములో నాగావళి అయినదని కధనం. ఈ పంచ శివలింగాలను మహాశివరాత్రినాడు దర్శించుకొనిన కోరుకున్న కోర్కెలు తీరునని ప్రజల విశ్వాసం.
సూర్యోదయం నుంచి లింగోద్భవకాలము లోగా నాలుగు తీర్థాలని దర్శించి, లింగోద్భవ కాలానికి సంగమేశ్వర ఆలయానికి సమీపాన గల (నాగావళి , వేగావతి , సువర్ణముఖి ) త్రివేణి సంగమం లో పవిత్ర స్నానం ఆచరించాలి. ఆ జలముతో స్వామికి అభిషేకం చెయ్యటం ఒక మహాభాగ్యం అని భక్తుల విశ్వాసం. అమ్మ కల్యాణ మొనరించు కనకమహాలక్ష్మి తల్లి.
సంగాం విశిష్టత శంకరుడు ఆరునెలలు గంగమ్మ తో ఆరు నెలలు గౌరమ్మతో ఉంటాడని అందుకే సంగమ ఈశ్వరుడు – సంగమేశ్వరుడయ్యాడని స్థల పురాణం. వందల సంవత్సరాల వూడల మర్రి అందరికీ విశ్రాంతినిస్తుంది. శివరాత్రి సందర్భంగాగా 9 రోజుల యాత్ర – నాటకాలు -వేడుకలు గ్రామస్తుల , రెవెన్యూ ,పోలీస్ , దేవాదాయ శాఖల సమన్వయంతో అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకొంటారు.
రాజాం నుంచి వంగర బస్సులు ఉంటాయి. వోని సెంటర్ లో దిగాలి – ఆటోలో అక్కడ నుంచి 3 కిలోమీటరు దూరంలో ఈ పవిత్ర సంగమేశ్వరాలయం ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చు కొంగుబంగారం సంగమేశ్వరుడు. దర్శించండి – తరించండి.
చేబియ్యం శ్రీనివాసరావు