ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో ఏ అభ్యర్ధిని నిర్ణయించాలనే విషయంలో వైసిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కాబోతున్నాయి.
రాజ్యసభకు అవకాశం దక్కబోతున్న ప్రముఖులలో ముఖ్యమంత్రి మంత్రి చెల్లెలు, పార్టీకి విశిష్టమైన సేవలు అందించిన షర్మిల మొదటి స్థానంలో ఉన్నారు. ఆమె సేవలను రాజ్యసభలో వినియోగించుకోవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఎంపిక ఖరారు అయింది. అదే విధంగా ముఖ్యమంత్రి కి సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకట రమణ కు రాజ్యసభ టిక్కెట్ దాదాపుగా ఖరారైంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన మోపిదేవి ని రాజ్యసభకు పంపడం వల్ల ఢిల్లీలో తనకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాని రీతిలో పరిస్థితి మారుతుందని జగన్ భావిస్తున్నారు. లోక్ సభ ఎంపిలలో కొందరు బిజెపితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్లు జగన్ కు అనుమానం ఉంది. వారి కార్యకలాపాలపై ఎంతగా నిఘావేసినా వారు ఏదో చేస్తున్నారనే అనుమానం రోజు రోజుకు బలపడుతున్న సమయంలో తనకు అత్యంత విధేయులనే రాజ్యసభకు పంపాలని జగన్ యోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపి గోకరాజు గంగరాజును ఆయన ఎంపిక చేసుకున్నారు. బిజెపి నుంచి వైసిపిలో చేరిన గోకరాజు గంగరాజు క్షత్రియ సామాజిక వర్గంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి. కొద్ది నెలల కిందట ఆయన తన కుటుంబ సభ్యులతో సహా కలిసి వచ్చి వైసిపిలో చేరారు. అదే విధంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు.
ప్రస్తుతం వైసిపిలో ఉన్న సినీ నటులకు ఇప్పటికే పదవులు ఇచ్చేసినందున సినీ పరిశ్రమ కోటాలో పొట్లూరి వరప్రసాద్ (పి వి పి) ని ఎంపిక చేసుకోవాలని జగన్ భావిస్తున్నారని తెలిసింది. ఆఖరు నిమిషంలో ఏవైనా మార్పులు జరిగితే తప్ప ఈ నాలుగు పేర్లూ దాదాపుగా ఖరారైనట్లేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.