ఎన్నికల సమయంలో మొక్కిన ప్రకారం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. నేటి పాదయాత్రలో ఆయనతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయం వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత భైరవస్వామి ఆలయం నుంచి మద్దికుంట బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు.
అందులో భాగంగా భైరవస్వామి ఆలయం నుంచి బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం వరకు నేడు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రజలు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలుకగా రామలింగేశ్వర ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో పాదయాత్రగా వస్తానని మొక్కుకోవడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులం అయినా మానవ మాత్రులమేనని, అందుకే మొక్కు చెల్లించుకోవడానికి పాదయాత్ర చేపట్టానని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాలభైరవ స్వామి ఆలయం, కామారెడ్డి నియోజకవర్గంలోని బుగ్గరామలింగేశ్వర ఆలయాలు భక్తుల కోర్కెలు తీర్చే ప్రతిష్ట కలిగిన అలయాలన్నారు.
శివరాత్రి సందర్బంగా బుగ్గరామలింగేశ్వర స్వామి అలయానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారని చెప్పారు. రాబోవు రోజుల్లో ఈ రెండు ఆలయాలకు ఎన్ని నిధులైన వెచ్చించి ఆలయాల అభివృద్దికి తోడ్పడతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబోద్దీన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, రామారెడ్డి, మాచారెడ్డి ఎంపీపీలు దశరథ్ రెడ్డి, నర్సింగ్ రావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.