దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 14 నుంచి గర్భిణులకు కేసీఆర్ పోషక కిట్లు పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి తెలిపారు.
మెదక్ కలెక్టరేట్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తొమ్మిది జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ అమలవుతోందని, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మిగతా జిల్లాల్లో అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
గర్భిణులకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో కిట్లు అందించాలని ఆదేశించారు. ఏఎన్ఎంలకు రక్తపోటు చూసే యంత్రాలు, ఎన్సీడీ మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రతిభ చూపిన ఉద్యోగులకు అవార్డులు అందజేయాలని సూచించారు.
14న వైద్యారోగ్య దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మెదక్ నియోజకవర్గ ప్రగతి నివేదికపై ఆమె అధికారులతో చర్చించారు.
పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్, డీఎంహెచ్వో చందునాయక్, డీఎస్వో నవీన్, ప్రోగ్రాం అధికారులు మాధురి, రాంమోహన్, విజయనిర్మల, ఉప వైద్యాధికారిణిలు అనిలా, అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.