కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతులకు రూ.4వేలు పింఛను ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పోడుభూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం వేదికగా ఎన్నికల హామీలు ప్రకటించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘‘భారత్ జోడోయాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని, దేశాన్ని ఏకం చేసేందుకు జోడో యాత్ర చేశా. ప్రజల్లో విద్వేషం తొలగించే ప్రయత్నం చేశామని, అది కాంగ్రెస్పార్టీ సిద్ధాంతం. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించింది. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు అన్నారు .
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని స్వాగతిస్తున్నానని పొంగులేటి పులిలా పోరాడుతున్నారని, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని, మీ మనసుల్లో.. మీ రక్తంలో కాంగ్రెస్ ఉంది. పీపుల్స్ మార్చి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఓ స్వప్నంగా ఉండేది.
తెలంగాణ.. పేదలు, రైతులు అందరికీ ఓ స్వప్నం. తొమ్మిదేళ్ల పాటు ఆ కలను భారాస ధ్వంసం చేసింది. బీఆర్ఎస్ అంటే భాజాపా రిష్తేదార్ పార్టీ (భాజపా బంధువుల పార్టీ). సీఎం కేసీఆర్ తెలంగాణకు రాజుగా భావిస్తున్నారని ఆరోపించారు . ఈ రాష్ట్రం ఆయన జాగీరు అనుకుంటున్నారు. ధరణితో భూములు ఎలా దోచుకుంటున్నారో భారత్ జోడో యాత్ర సందర్భంగా మీరు చెప్పారు. ఈ భూములు కేసీఆర్వి కావు.. మిషన్ భగీరథలో రూ.వేల కోట్లు దోచుకున్నారు.
కాళేశ్వరంలో రూ.లక్షకోట్లు దోచుకున్నారు. సమాజంలో అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారు. పార్లమెంట్లో భాజపాకు భారాస బీ టీమ్గా పనిచేసింది. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. భారాస మద్దతు పలికింది. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతిలో ఉంది. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడించింది. కర్ణాటకలో రైతులు, ఆదివాసీలు, పేదలు అందరూ కాంగ్రెస్ పక్షాన నిలిచారు. తెలంగాణలో కూడా ఇదే జరగబోతోంది. తెలంగాణలో భాజపా పని అయిపోయింది. మొదట్లో ఇక్కడ ముక్కోణపు పోటీ అనుకున్నారు. కానీ, భాజపా బీటీమ్ భారాస, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. కర్ణాటకలో భాజపాను ఓడించిన విధంగానే తెలంగాణలో భాజపా బీటీమ్ను ఓడించబోతున్నాం.
భారాసతో కాంగ్రెస్కు ఎలాంటి ఒప్పందం ఉండదు. ఇటీవల దిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. విపక్షాల భేటీకి భారాస వస్తుందా అని అడిగాం. భారాస వస్తే మేం హాజరుకాబోమని చెప్పాం. కేసీఆర్ అవినీతికి ప్రధాని మోదీ అండదండలే కారణం. కేసీఆర్ ఏ స్కామ్లు చేశారో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మోదీకి తెలుసు. అందుకోసమే భారాస భాజపాకు బీటీమ్గా ఉంది’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.