చీటిలు, రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం పేరుతో రూ.50 కోట్లకు పైగా మోసం చేసి ఉడాయించిన ఒక వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యక్తులు తాడికొండ చంద్రశేఖర్ అనే వ్యక్తి చేతుల్లో మోసపోయినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఇరవై రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా తన పేరిట ఉన్న స్థిరాస్తులను వేరే వ్యక్తుల పేరిట బదలాయించి సదరు వ్యక్తి పరారైనట్లు తెలియడంతో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి చేరుకొని అధికారులవద్ద మొర పెట్టుకున్నారు.
తాడికొండ చంద్రశేఖర్ తనకు సినీ రంగంతో పరిచయాలు ఉన్నాయని , సినిమాలకు ఫైనాన్స్ చేస్తుంటానని, లాభాల్లో వాటా ఇస్తానని, చిట్స్ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అవసరమని ఇలా పలు రకాలుగా పట్టణంలోని వ్యాపారుల వద్ద నుండి పెద్ద మొత్తాల్లో డబ్బు గుంజాడు.
చిట్స్ లో సభ్యులను థాయిలాండ్, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకు టూర్లు తీసుకెళ్లి అక్కడ సకల సౌకర్యాలు కలుగ జేయడంతో పాటు, కొన్ని సార్లు చిట్ సభ్యుల కుటుంబ సభ్యులతో సహా విదేశాలకు టూర్లకు తీసుకెళ్లేవాడు. ఇటీవల తన కూతురు ప్రవల్లికని గుంటూరు పట్టణానికి చెందిన KVSR&SONS స్టీలు షాప్ యజమాని కొత్తూరు శ్రీనివాసరావు కుమారుడు రామ్ తేజకి ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు.
ఇప్పుడు ఆమె కూడా తన తండ్రి అప్పులకు తనకూ సంబంధం లేదని చెప్పడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తండ్రి పారిపోతే తనని వేధిస్తున్నారంటూ అప్పులిచ్చిన వారి పైనే ఆమె తిరిగి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
అయితే శేఖర్ పరారికి ముందు ఆస్తుల బదలాయింపు చేసిన వ్యవహారం మొత్తం శేఖర్ భార్య సామ్రాజ్యం , వియ్యంకుడు కొత్తూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారిరువురి సన్నిహితుల పేర్ల మీదకే మార్చారని ఈ మొత్తం కుట్రలో శేఖర్ భార్య సామ్రాజ్యం , వియ్యకుడు శ్రీనివాసరావు , కుమార్తె ప్రవల్లికలే ప్రధాన పాత్రదారులని అప్పులిచ్చిన దగ్గరి బంధువులు కొందరు ఆరోపిస్తున్నారు.