తెలంగాణ ఎంసెట్ రెండో విడతలో కొత్తగా 21,136 మంది సీట్లు పొందారు. తొలి విడతలో చేరిన 42,998 మంది కలిపి మొత్తం 64,134 మందికి సీట్లు దక్కాయి. మొత్తం కన్వీనర్ సీట్లలో 81.87% భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు ఈ నెల 18 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి అదే విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాతే అభ్యర్థులు ఆయా కళాశాలలకు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. మొదటి విడతలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారు రెండో విడతలో మరో కళాశాలలో సీటు వస్తే ఫీజు వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు తగ్గితే చివరి విడత తర్వాత విద్యార్థులకు చెల్లిస్తారు.
ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5,265 మందికి సీట్లు దక్కాయి. క్రీడా, ఎన్సీసీ కోటాకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ప్రాధాన్యాలు రానందున చివరి విడత కౌన్సెలింగ్లో వారికి సీట్లు కేటాయిస్తారు. తొలి రౌండ్లో సీట్లు పొందిన వారిలో 20 శాతం మంది వరకు కళాశాలలు, బ్రాంచీలు మారారని అధికారులు తెలిపారు. రెండో విడతలో 53,848 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో కొత్తగా 3,547 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై ఆప్షన్లు ఇచ్చారు. ఈ విడతలో తగినన్ని ఐచ్ఛికాలు ఇవ్వని 4,590 మందికి సీట్లు రాలేదు. కాగా కన్వీనర్ కోటా కింద 78,336 సీట్లు ఉండగా సీఎస్ఈ, ఐటీ, సంబంధిత 17 బ్రాంచీల సీట్లు 48,422 ఉన్నాయి. అందులో 45,731 సీట్లు (94.44%) నిండాయి. వీటిలోఇక మిగిలింది 2,691 సీట్లే. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత బ్రాంచీల్లో 18,580 సీట్లకు 14,408 సీట్లు (77.55%) సివిల్, మెకానికల్ సంబంధిత బ్రాంచీల్లో 10,158 సీట్లకు 3,451 (33.97%) సీట్లు నిండాయి.