మంత్రి విశ్వరూప్ చూపు జనసేన వైపు
కోనసీమ జిల్లాలో అధికార వైకాపాకు బిగ్ షాక్ తగల నుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జనసేనలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం మంత్రి విశ్వరూప్ ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే 175 సీట్లలో పోటీ చేయాలన్నారు. పవన్ సీఎం కావాలని జన సెనే కాదు.. తాను కోరుకుంటున్నానని తన మనసులో మాట చెప్పకనే చెప్పాడు. విశ్వరూప్ బదులు ఆయన తనయుడు జనసేన తరపున పోటీ చేస్తారనే వూహాగానాలు వినిపిస్తున్నాయి. విశ్వరూప్ గత కొంత కాలంగా అసంతృప్తితో వున్నారు.
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టిన సమయంలో జరిగిన విధ్వంస కాండలో తన ఇంటికి నిప్పు పెట్టీ కుటుంబాన్ని సజీవ దహనం చేయాలని ఆందోళన కారులు దారుణానికి పాల్పడిన సమయంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదనే అసంతృప్తి ఆయనలో వుంది. అనంతరం ఆయన యాక్టివ్ గా వుండడం లేదు. ఇటీవలి కాలంలో ఆయన టీడీపీ నేతలతో సన్నిహితంగా వుండడంతో ఆయన ఆ పార్టీలో చేరుతారనే పుకార్లు షికార్లు చేశాయి.
అయితే వారాహీ యాత్రకు కోన సీమలో లభిస్తున్న ఆదరణ తో ఆయన మనసు మార్చుకుని జనసేనలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమలాపురం సభలో పవన్, మంత్రి విశ్వరూప్ పై విమర్శలు చేయలేదనే వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. మొత్తం మీద మంత్రి విశ్వరూప్ జనసేనలో చేరనున్నట్లు వస్తున్న వార్తలు అధికార వైకాపాకు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ముద్రగడ ద్వారా జనసేనానికి పవన్ కు షాక్ ఇవ్వాలనే ముఖ్యమంత్రి జగన్ వ్యూహం బెడిసి కొట్టినట్లు అయింది.