గజ్వేల్ ఘర్షణల విషయంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వర్గ వైశ్యామ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదుతో పాటుగా, మరో ఇద్దిరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం పిడిచేడ్ రోడ్ లో ఉన్న శివాజీ విగ్రహం వద్ద మూత్ర విజర్జన చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి, అల్లర్లకు కారకులనై మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అఖిల్, మహమ్మద్ జహీర్ ను అరెస్టు చేయడంతో పాటుగా కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ ఘటనలో సందీప్ పై దాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై హత్యయత్నం కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తంగా అల్లర్లలో ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు పంపించినట్లు సీపీ వెల్లడించారు.
అల్లర్ల విషయంలో విచారణ కొనసాగుతుందని, వీడియో ఫుటేజ్ అధారంగా మరి కొంతమంది నిందితులను గుర్తించి త్వరలోనే మరికొంత మందిని అరెస్టు చేస్తామన్నారు.ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా.. ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గజ్వేల్ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని సమన్వయం పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని సీపీ శ్వేత సూచించారు.