ఎంఫిల్, పీహెచ్డీ చేసే మైనారిటీ పరిశోధక విద్యార్థులకు మౌలానా ఆజాద్ పేరిట ఇచ్చే ఉపకార వేతనాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని భేషరతుగా ఉపసంహరించుకోవాలని AISF జాతీయ కార్యదర్శి విక్కీ మహేశరీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ AISF తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్కీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు.
మోలానా ఆజాద్ ఉపకార వేతనాలను రద్దు చేయడం ద్వారా ఆ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. మౌలానా ఆజాద్ ఉపకార వేతనాల సహాయంతో లక్షలాది మంది మైనారిటీ పరిశోధక విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారు పరిశోధన రంగానికి దూరం అవుతారని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని భేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేదంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని విక్కీ మహేశరీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన AISF తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, మైనారిటీలకు ఉన్నత విద్య దూరం చేయడానికే మోడీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోడీ అధికారంలోకి వచ్చాక దళితులు, మహిళలు, గిరిజనులు, మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని లేదంటే బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో AISF రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఆఫీస్ బేరర్స్ రెహమాన్, గ్యార క్రాంతి, మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వర్, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి వంశీ వర్ధన్ రెడ్డి, ఓయూ అధ్యక్షులు క్రాంతి రాజ్, హరీష్, చిన్నబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.