ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన మనం మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి? ఇదే పనిమీద జగన్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన త్వరలో కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులను ఎవరిని నియమించుకోవాలనే విషయంపైనే ఆయన ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. మరొక మారు గెలవడానికి తన డ్రీమ్ ఎలక్షన్ టీమును సిద్దం చేసే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు.
ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ వారిపై ఎక్కువ కేసులు పెట్టిన పోలీసు అధికారులను, తెలుగుదేశం పార్టీ వారిని తమ కార్యక్రమాలు నిర్వహించుకోకుండా అదుపు చేసిన పోలీసు అధికారులను ఎంపిక చేసుకుంటున్నారని చర్చ జరుగుతున్నది.
కలెక్టర్లు, వారి కింది స్థాయి అధికారుల కన్నా పోలీసులు తనకు నమ్మకమైన వారిని పెట్టుకోవడం ద్వారానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ యోచిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచీ వివిధ పదవుల్లో కొనసాగుతున్న పార్టీ పెద్దలను… మొదటి విడత వారి పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి కూడా నియమించారు. అలా చాలా మంది పదవుల్లో కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అయా స్థానాలలో ఇతరులను…. పార్టీకి సేవ చేసిన వారిని నియమించాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో తనకు అత్యంత విధేయుడు అయిన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని నియమించుకున్నారు.
కరుణాకర్ రెడ్డి మత విశ్వాసాలపై పెద్ద స్థాయిలో దుమారం చెలరేగినా కూడా జగన్ రెడ్డి తన పట్టుదలనే నెగ్గించుకున్నారు. ఇలా ప్రభుత్వ పదవులతో బాటు పార్టీ పదవులను కూడా తనకు నమ్మకం ఉన్న రెడ్డి కులస్తులకే ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.
వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి సీనియర్ నేత విజయ సాయి రెడ్డిని గతేడాది తొలగించారు. అలాగే, ప్రాంతీయ సమన్వయకర్త పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడా స్థానాన్ని విజయసాయిరెడ్డికి అప్ప చెప్పారు. అలాగే, అన్ని జిల్లా పార్టీ బాధ్యతలు కూడ ఈ మధ్య ఆయనకే ఇవ్వడం జరిగింది.
ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయానికి వస్తే అవకాశం ఉన్నంత వరకు పాత వారిని పార్టీ అభ్యర్ధులుగా కొనసాగిస్తామని చెబుతున్నా చాలా నియోజకవర్గాలలో కొత్త వారిని, చదువుకున్న వారిని, ఆర్థికంగా ఉన్నవారిని, పలుకుబడి ఉన్న యువతను రంగంలో దించాలని జగన్ భావిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తి ఉన్నారు. ఇసుక, మద్యం వ్యాపారాలను దాదాపుగా ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఎమ్మెల్యేలు లేదా వారి బినామీలు మాత్రమే వ్యాపారాలు చేసుకుంటూ కోట్లు గడించారు. అయితే ఎవరూ తమ వద్ద డబ్బుల్లేవనే చెబుతున్నారని ఈ కారణంతో వారి వారి ఆర్ధిక పరిస్థితిని కూడా అంచనా వేయాలని కొందరు అధికారులను జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేయాలో కూడా ముందే నిర్ణయించి అభ్యర్ధులకు టార్గెట్ పెట్టాలని కూడా జగన్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాము చెప్పే ఖర్చుకు సిద్ధపడని వారిని ఎమ్మెల్యేలుగా తొలగించి వేరే వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు త్వరలో ప్రతి యమ్ యల్ ఏ కు, యమ్ పి లకు వారి సీట్ల గురించి స్వయంగా పిలిచి జగన్ వివరాలు చెప్ప నున్నట్లు తెలిసింది.
త్వరలో రాష్ట్రం లోని ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని తన స్వంత బెంగుళూరు టీమ్ ల ద్వారా పర్యవేక్షించాలని జగన్ నిర్ణయించుకున్నారని కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేరుగా జగన్ దిశా నిర్దేశం లో ఆంధ్ర లోని అన్ని ప్రాంతాలకు టీమ్ లు గోప్యంగా చేరుకుని ఇప్పటికే పనిచేస్తున్నాయని అంటున్నారు. వీరి రిపోర్ట్ ఆధారంగా జగన్ తన ఎలక్షన్ టీమ్ ఏర్పాటు చేసుకోనున్నారు.
వీరి రిపోర్టు త్వర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల ప్రభుత్వ ఉద్యోగులను మరీ ముఖ్యంగా పరిపాలనలోని ముఖ్య అధికారులను, ఐఏయస్, ఐ పి యస్ లతో పాటు ప్రతి గవర్నమెంటు ఉద్యోగిని బదిలీ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే కొంత వరకు ఈ బదిలీలు జరిగాయి.
అయితే ఇవి ప్రారంభ మాత్రమేనని ముందు ముందు పెద్ద ఎత్తున అధికారుల బదిలీలకు అవకాశం ఉందని అంటున్నారు.
ముఖ్య పొస్ట్ లలో ఉన్న అందరు అధికారులపై బదిలీ వేటు పడనున్నదని అంటున్నారు.ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా ఈ హంగులతో మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.