ఈ నెల 19వ తేదీన భుజాలు నెప్పిగా ఉన్నాయని, నీరసం గా ఉందనీ చెప్పాడు. (క్రితం రోజు సరిగ్గా నిద్రపోలేదు భోజనం చేయలేదు కనుక అలా జరగడం సహజం అనుకున్నాము) ఆ రోజు రాత్రి పూర్తిగా రెండు కాళ్ళు నిలబడలేవు.
మరుసటి రోజే ఆస్పత్రికి వెళ్ళాం. విటమిన్స్ టాబ్లెట్స్, ఒక సూది మందు ఇచ్చారు. ఎందుకైనా మంచిదని కొవిడ్ టెస్ట్ చేయించమని చెప్పారు. అది ఉంటే గానీ ఏ ఆస్పత్రి చేర్చుకోదు. వైద్యం చేయదు.
వెంటనే మొదలు పెట్టాము. రాపిడెక్స్ పరీక్ష నెగిటివ్ వచ్చింది. కొంత ఊపీరి పీల్చుకున్నాం. ప్రాణాంతక వ్యాధి కాదు అని భావించాం.
అక్కడి నుండి మా బాధలు మొదలయ్యాయి……
లాబరేటరీ టెస్ట్ రిపోర్ట్ కు 48 గంటల సమయం పడుతుంది అన్నారు. చేసేది ఏమీ లేకపోయింది. ఆ రోజు రాత్రి డాక్టర్ వేరే మందులు రాసి ఇచ్చారు. వాటిని వాడాము. కానీ అవి ప్రభావం చూపలేదు.
తెల్లవారగానే కాచిగూడ లోని సాయి న్యూరో ఆస్పత్రికి వెళ్ళాము…అక్కడి నుండి మా బాధలు మొదలయ్యాయి.
ఆ తర్వాత ప్రతిమ ఆస్పత్రి , వెంటనే సి సి శరాఫ్ అక్కడ మెదడు, ఊపిరి తిత్తుల, మొత్తం శరీరం స్కానింగ్ చేశారు.
అంతా బాగానే ఉంది కానీ ఊపిరి తిత్తులల్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అది ఏమైనా కావొచ్చు. ( కోవిద్ ? అని వ్రాశారు… ) మా వద్ద వెంటీ లేటర్లు, బెడ్స్ లేవు కనుక మీరు వేరే దారి చూసుకోండి అన్నారు.
సాయంత్రం వరకు ఖాళీ అయితే తీసుకుంటాం అని ఒక చిన్న ఆశ కూడా కల్పించారు. ఆ తర్వాత ఇదే రీతిలో నిమ్స్, యశోద, బర్కత్ పురాలోని ఆస్పత్రి వాళ్ళందరూ తిప్పారు.
అప్పటికే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయం గడిచింది. చివరకు కాచిగూడ లోని వైష్ణవి హోటల్ స్థానంలో కొత్తగా పెట్టిన ఆస్పత్రి వాళ్ళు చికిత్సకు అంగీకరించారు.
మూడు లక్షలు కట్టమన్నారు. మేము అంగీకరించి లక్ష అడ్వాన్స్ చెల్లించాము. మిగతాది కాసేపట్లో సర్ధుతాం అని చెప్పాను.
సరే, కానీ డాక్టర్లు వచ్చి చెకప్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెడతాము అన్నారు. కానీ అక్కడే ఆలస్యం అయ్యింది. పరిస్థితి విషమించడంతో చేతులు ఎత్తేశారు.
మా వద్ద వెంటి లెటర్స్ లేవు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపొండి అంటూ వైద్య సేవలకు నిరాకరించారు.
అక్కడ సంఘర్షణ కంటే ప్రాణాలు కాపాడు కొనడం ముఖ్యం. మేము ఇతర చోట్ల ప్రయత్నాలు మొదలు పెడితే కూకట్ పల్లి లో ఒకటి కన్ఫర్మ్ అయింది. తీసుకెళ్లడానికి అంబులెన్స్ రప్పించాం.
అయితే అప్పటికే వరిస్థితి చేయిదాటింది.. బ్రతకడం కష్టం అన్నారు. అక్కడి నుండి తరలించడం కూడా ప్రమాదమే….అయినా చివరి వరకు ప్రయత్నం చేద్దాం అని బయలు దేరాం.
అక్కడికెళ్లిన తర్వాత మీరు చాలా ఆలస్యం చేశారు. 99.9 శాతం ప్రాణం నిలవదు. మిమ్మల్ని మోస పుచ్చి వైద్యం చేయలేము . ఇంటికి తీసుకెళ్లండని అన్నారు. కానీ ఇంటికి తీసుకెళ్లి ఏం చేయాలి.. ప్రాణం ఉన్నంత వరకైనా ట్రీట్ మెంట్ చేయండని రిక్వెస్ట్ చేశాం.
ఎందుకు అనవసరంగా డబ్బులు వృధా… మేము ఆ పని చేయలేం అన్నారు. నిజాయితీగా మాట్లాడిన ఆస్పత్రి ఇదొక్కటే…. దీని చిరునామా ముందే ఎందుకు తెలియలేదని బాధ పడ్డాం.
కనీసం అక్కడే ఉంచడానికి వారు అనుమతించిన బాగుండును. కానీ అలా జరగలేదు. వికాస్ మిత్రులు కొన ఊపిరి ఉన్నంతవరకైనా సరే పోరాడుదాం.
గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్దాం అన్నారు. ఉస్మానియాలో క్యూ లైన్ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
కనుక రిస్క అయినా గాంధీకి వెళ్దాం అనుకొని మనసు ఒప్పుకోకపోయినా… కనీసం అక్కడ వైద్యం అందుతుందని వెళ్లాము. కూకట్ పల్లి నుండి గాంధీకి రెండు అంబులెన్సలు మారాము. ఇదో రకమైన దోపిడి. అయినా లెక్క చేయలేదు.
గాంధీలో పరిస్థితి చూస్తే దారుణం……
గాంధీలో పరిస్థితి చూస్తే దారుణం… అంబులెన్స్ లో ఉండే టెక్నిషియన్ నేరుగా వచ్చి డాక్టర్లతో అతను అంతిమ శ్వాస దారిలోనే వదిలాడు. మీరు ఒకసారి వచ్చి కన్పర్మ చేయండని చెప్పాడు… ఆ విధంగా చేయాలంటే గాంధీలో జాయిన్ అయినట్లు ఓపీ స్లిప్ తీసుకోమని చెప్పారు.
తప్పనిసరి పరిస్థతిలో విధి రాత ముందు తలవంచాం. మా వికాస్ పార్ధివ దేహాన్ని మరుసటి రోజు కోవిడ్ ఫేషంట్ గా గాక సాధారణ ఔట్ పేషంట్ గా అప్పగిస్తాం అంటే గాంధీలో ఉంచడానికి అంగీకరించాం.
మరుసటి రోజు ఇక్కడ వాతావరణం, మిగతావారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని… అంతకంటే మించి మావలె ఏ ఒక్కరు ఇలా కష్టపడి ఆస్పత్రిల పాలు కాకూడదని వికాస్ పార్ధివ దేహానికి స్మశాన వాటికలోనే సంప్రదాయ రీతిలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశాం.
మిత్రులు మొదటి నుంచి చివరి దాకా ఎంతో శ్రమించారు
ఈ సమయంలో స్వర్గీయ వికాస్ మిత్రులు మొదటి నుంచి చివరి దాకా ఎంతో శ్రమించారు. ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడు కొనడానికి సిద్దం అయ్యారు. మాకు తోడుగా నిలిచారు.
అండగా ఉన్నారు. వారందరికీ రెండు చేతులూ జోడించి నమస్కారం చెబుతున్నాను.
నేను ఆరాధించే ఆంజనేయ స్వామి దైవం శ్రీరామచంద్ర ప్రభువు కు విశేషమైన రోజు శ్రీరామనవమి నాడు రాత్రి 10.50 నిమిషాలకు వికాస్ స్వర్గలోకాలకు బయలు దేరాడని సర్టీపికెట్ ఇచ్చారు.
మరుసటి రోజు 48 గంటలకు రావల్సిన కోవిడ్ రెండో పరీక్ష సర్టీఫికెట్ నెగిటివ్ గా వచ్చింది. ఇది రావడం ఆలస్యం అయింది. వికాస్ పార్ధీవ దేహం 12 గంటల వ్యవధిలోనే చేరింది.
కార్పోరేట్ ఆస్పత్రిల కాసుల కక్కుర్తి….
మానవత్వం మరిచిన తీరు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకొంది. 23 ఏండ్ల నవయువకున్ని పొట్టన పెట్టుకుంది. మాకు శోకాన్ని మిగిల్చింది. నైతిక విలువలకు తూట్లు పొడిచింది…
(హైదరాబాద్ కాచిగూడ లో ఒక కుటుంబానికి కలిగిన అనుభవం)