ఆ ఎమ్మెల్యే ఏది చేసినా అందులో కొత్తదనం కనిపిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఆటో కార్మికులకు సరుకులతో పాటు నగదును అందజేసి ఉదారతను చాటుకున్నారు.
ప్రస్తుతం కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు పెళ్లి కానుకగా ఆ ఆడబిడ్డకు చీర అందజేశారు. ఆయనే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు ఇసన్నపల్లి, కన్నాపూర్, గొల్లపల్లి, పోసానిపెట్, ఉప్పలవాయి, మోషంపూర్ గ్రామాలకు సంబందించిన 38 మంది కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెక్కులను పంపిణీ చేశారు.
38 మందికి 36 లక్షల 6 వేల 176 రూపాయలకు సంబందించిన చెక్కులతో పాటు ఆ ఆడబిడ్డకు తనవంతుగా చీరను పెళ్లి కానుకగా అందజేశారు. 38 మంది లబ్దిదారులకు ఇంటింటికి బులెట్ బైకుపై తిరుగుతూ స్వయంగా లబ్దిదారులకు అందజేశారు. దాంతో లబ్దిదారులు ఎమ్మెల్యే సురేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. ఆడపిల్ల కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉండి లక్ష నూట పదహారు రూపాయలను ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు.
అలాగే తనకు ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతగా తన వంతు సహాయంగా చీరను బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.