కాపురానికి రానని చెప్పిన భార్యతో గొడవపడ్డ అతడు ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో జరిగింది. నేరేడు చర్లకు చెందిన శ్రీదేవిని ఐదేళ్ల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సుజయ్కు ఇచ్చి పెళ్లిచేశారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది.
సుజయ్ తల్లిదండ్రులు శ్రీదేవిని అదనపు కట్నం కోసం వేధించేవారు. ఆ వేధింపులు భరించలేక శ్రీదేవి తరచూ పుట్టింటికి వచ్చేసేది. భర్త సుజయ్ వచ్చి బతిమిలాడి మళ్లీ తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న వీరి మధ్య గొడవ జరిగింది. శ్రీదేవి హైదరాబాద్లో ఉంటున్న తన సోదరి రాజేశ్వరి ఇంటికి వెళ్లింది.
20న నేరేడుచర్లకు వచ్చిన సుజయ్ తన భార్యతో మాట్లాడాలంటూ తన అత్త యాదమ్మ, యాదమ్మ సోదరుడు గుంజ శంకర్ (31) లతో గొడవపడ్డాడు. దాంతో శుక్రవారం శ్రీదేవిని నేరేడుచర్లకు పిలిపించారు. తాను భర్తతో కాపురానికి వెళ్లేది లేదని ఆమె తేల్చిచెప్పింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది.
మద్యం మత్తులో ఉన్న సుజయ్ కూతురు శాన్విత(3)ను కారులోకి బలవంతంగా ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శంకర్ కారుకు అడ్డుపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న సుజయ్, శంకర్ను ఢీకొట్టి, కారును వేగంగా ముందుకు కదిలించాడు. శంకర్ ఎగిరి బానెట్పై పడ్డాడు. అలా జాన్పహాడ్ రోడ్డు వరకు సుమారుగా 2 కిలోమీటర్ల వరకూ తీసుకుపోయాడు. ఆ తర్వాత శంకర్ ముందుకు ఎగిరిపడ్డాడు. సుజయ్ అతడి మీద నుంచే కారును పోనిచ్చాడు. అలాగే ఈడ్చుకెళ్లాడు. తీవ్రగాయాలైన శంకర్ను మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. శంకర్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.