ఓ చిన్న తప్పిందం…చేసిన పనికే కళంకం తెస్తుంది…ఓ చిన్న పొరపాటు…ఆ పని చేసే శాఖకే చెడ్డ పేరు తెస్తుంది. రెండేళ్ల తర్వాత విజయనగరం పైడితల్లి సిరిమాను సంబరంలో అదే జరిగింది. అన్ని శాఖల సమిష్టి కృషితో సిరిమానోత్సవం ప్ర్రశాంతంగా ముగిసినా…..సిరిమానుపై ఇరుసు బిగించే క్రమంలో జరిగిన ఆలస్యంతో గంటన్నర ఆలస్యంగా సిరిమాను ప్రారంభమైంది. ఉత్సవానికి అమ్మవారి సిరిమానును, ఇతర రథాలను రెండు గంటలకే ఆలయం వద్దకు తీసుకువచ్చినప్పటికీ అమ్మవారి టెంపుల్ వద్దకు వచ్చి అక్కడ ఇరుసు బిగించడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం మూడున్నరకు ప్రారంభం కావలసిన సిరిమాను ఊరేగింపు…అయిదుగంటలకు ప్రారంభమైంది.
రెండేళ్ల తరువాత, ఈ ఏడాది భక్తులను ప్రత్యక్షంగా తిలకించేందుకు అనుమతి ఇవ్వడంతో, ఉత్సవాన్ని చూసేందుకు లక్షలాది గా తరలివచ్చారు. సిరిమాను తిరిగే మార్గంలో రోడ్లకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి నియంత్రించారు. బారికేడ్లను ఆర్అండ్బి అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఉచితంగా త్రాగునీటి సదుపాయం కల్పించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా త్రాగునీరు, ఆహార పదార్ధాలను పంపిణీ చేశాయి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి సిరిమానోత్సవాన్ని ఆద్యంతమూ స్వయంగా పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ సూచనలను అనుగుణంగా, డిఆర్వో ఎం.గణపతిరావు, ఆర్డిఓ సూర్యకళ, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు, ఇతర అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆర్అండ్బి, పైడిమాంబ దేవస్థానం, వైద్యారోగ్యశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాన్స్కో తదితర సుమారు 22 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సమన్వయంతో కృషి చేసి, ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వీరిని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ప్రత్యేకంగా అభినందించారు. ఉత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసినందుకు ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పి దీపిక ఆధ్వర్యంలో పోలీసు శాఖ అందించిన సేవలు ప్రశంసలను అందుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఉత్సవాన్ని ప్రశాంతంగా ముగిసింది.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా