మతోన్మాద బిజెపితో పెను ప్రమాదం పొంచి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశంలో మతం, కులం పేర విభజన తీసుకుని రావడమే గాక దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖమ్మంజిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. సిద్దినేని కర్ణకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిన ఏ ప్రధాన మంత్రి చేయనివిధంగా మోడీ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సిబిఐ, ఈడి లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోడీ బిజెపి అనుబంధ సంస్థలుగా మార్చారని తనకు గిట్టని వ్యక్తులను, రాజకీయ శత్రువులను ఇబ్బందులు పెట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. చివరకు ఎన్నికల సంఘాన్ని, న్యాయ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు బిజెపి యత్నిస్తుందన్నారు. దేశంలో కర్మాగారాల స్థాపనకు ప్రభుత్వ రంగ సంస్థల వృద్ధికి అనేక దశాబ్దాలు పట్టిందని కానీ మోడీ ఎనిమిదేళ్ల కాలంలోనే వాటిని తెగనమ్మారని సాంబశివరావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతును నొక్కడమే మోడీ ఎజెండా అని ఆ క్రమంలోనే విపక్షాలు, మీడియా, ఇతర సంస్థలను కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు. బిజెపిని ఈ దేశం నుంచి పారద్రోలితే తప్ప దేశ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కొన్ని వ్యక్తులు, శక్తులు యువత జీవితంతో చెలగాటమాడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రశ్నా పత్రాలు లీకేజీకి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ బలాన్ని ప్రతిభింభించే రీతిలో కార్యాచరణ చేపడతామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు ప్రజా చైతన్యానికి పార్టీ తొలి ప్రాధాన్యతనిస్తుందన్నారు. పార్టీ ప్రాబల్యం ఉన్న చోట మరింత బలపడడంతో పాటు నూతన ప్రాంతాలకు పార్టీ కార్యక్రమాలను తీసుకువెళ్లేందుకు తొలి ప్రాధాన్యతనిస్తామని కూనంనేని తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి దేశ్క బచావో- బిజెపి హఠావో అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.