ప్రాణాలకు తెగించి కోవిడ్-19 పై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్యకార్యకర్తలపై కొందరు దాడులకు పాల్పడడం అత్యంత నీచం. కరోనా బాధితుల ఆరోగ్య పరిరక్షణ కోసం గత నెల రోజులుగా అకుంఠిత దీక్షతో సేవ చేస్తున్న వైద్య యోధులను సగటు మనిషి మొదలు ప్రధాని వరకు ప్రశంసలతో కీర్తిస్తుండగా కొన్నిచోట్ల అల్లరి మూకలు అనాగరికంగా అంతరాయం కలిగించడం బాధాకరం.
ఇండోర్, సూరత్, మొరదాబాద్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. విధినిర్వహణకు వెళ్ళిన వైద్య సిబ్బంది, పోలీసులు పై రాళ్ల తో మూకుమ్మడి దౌర్జన్య ఘటన యూపీ లోని మొరదాబాద్ లో జరిగింది.
ఈ దాడిలో ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశం మేరకు బెంగళూరు సమీపంలో ఉన్న సాదిక్ లేఅవుట్ ప్రాంతానికి కరోనా బాధితుల సర్వే కోసం వెళ్ళిన బృందాలను రాళ్లతో తరిమికొట్టారు. కరోనా అనుమానితులకు స్క్రీన్ పరీక్షలు నిర్వహించడానికి వెళ్ళిన నిపుణులను వ్యతిరేకించిన దుర్ఘటన ఇండోర్ లో నమోదైంది.
ఇటువంటి ఉదంతాలు దేశంలో ని పలుప్రాంతాలలో చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉలిక్కిపడి ప్రభుత్వానికి నిరసన తెలిపింది. కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్య కర్తల పై దాడిచేసేవారిని కఠినంగా శిక్షించాలని , అవసరమైతే ఇప్పుడు ఉన్న చట్టాలను సవరించాలని మోదీ సర్కారును వారు కోరారు.
సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఆర్డినెన్స్ ను తెరపైకి తెచ్చింది. 1897 నాటి ఎపిడమిక్ డీసీజేస్ యాక్ట్ కు సవరణ లు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం కరోనా నియంత్రణ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సంబంధిత సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
నేరం తీవ్రతకు అనుగుణంగా భారీ జరిమానా లు, జైలుశిక్ష ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా విధులు నిర్వహిస్తున్న వారికి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చింది. నేరానికి పాల్పడిన వారికి ఒక సంవత్సరం నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష తో పాటు రెండువేల నుంచి అయిదు లక్షల వరకు జరిమానా విధించేందుకు చట్టాన్ని సవసరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రుజువయిన నేరం ఆధారంగా జరిమానాలు, జైలు శిక్షలు అమలుచేస్తామని , ఈ సమస్యను అత్యవసర అంశంగా పరిగణనలోకి తీసుకొని కోవిడ్-19 యోధులకు సంపూర్ణ మద్దతు, భద్రత ను కల్పిస్తూ సర్కారు నిర్ణయం తీసుకోవడం ప్రశంస నీయం. మందే లేని మహమ్మారితో అనునిత్యం యుద్ధం చేస్తున్న ధీరోదాత్తులకు సంఘీభావం ప్రకటించడం ప్రతి ఒక్క భారతీయుని తక్షణ కర్తవ్యం.
కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి