ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ ప్రభుత్వం ఈ సంక్లిష్ట సమయంలో మరో వివాదంలో చిక్కుకున్నది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న దేవాలయ అర్చకులకు, చర్చిల్లో పాస్టర్లకు, మసీదుల్లో ఇమాంలకు ఈ నెలకు ఆర్ధిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి చొరవతో రాష్ట్రంలోని అర్చకులకు ఆర్ధిక సహాయం అందించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నదని వైసీపీ శ్రేణులు విపరీతంగా ప్రచారం చేశాయి. అర్చకులకు ఇంతలా సాయం చేసిన ప్రభుత్వం మరొకటి లేదని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానాలు చేశారు.
ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని జీవో జారీ అయింది. వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని అర్హులైన వారిని ఎంపిక చేశారు. ప్రభుత్వం ఎంపిక చేసిన వారిలో 21 వేల మంది పాస్టర్లు, 19వేల మంది అర్చకులు, 8 వేల మంది ఇమాంలు ఉన్నారు.
వీరందరికి సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 21 వేల మంది పాస్టర్లు ఎక్కడ ఉన్నారంటూ ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారికంగా 750 చర్చిలు మాత్రమే ఉన్నాయనే లెక్కలు ఉన్నాయి. 750 చర్చిలలో 21 వేల మంది పాస్టర్లు ఎలా ఉన్నారో అధికారులకే తెలియాలి.
అదే విధంగా రాష్ట్రంలో దాదాపుగా లక్షకు పైగా దేవాలయాలు ఉంటాయి. ఒక్కో దేవాలయంలో సగటున కనీసం ఇద్దరు అర్చకులు ఉంటారు. అలాంటిది కేవలం 19 వేల మంది అర్చకులను మాత్రమే ఎంపిక చేశారు. దీనిపై పలువురు ప్రశ్నిస్తున్నారు.