తెలంగాణకు ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, కరోనా వ్యాక్సీన్ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడిసివర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో.. 200 టన్నుల ఆక్సీజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సా లోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సిఎం కెసిఆర్ ను కోరారు. వ్యాక్సీన్లపై కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. డబుల్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రి సిఎం కేసిఆర్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సిఎం కెసిఆర్ స్సష్టం చేశారు.