అసలే ధరలు పెరిగి చస్తుంటే….అందులో కల్తీనా? అంటూ వాపోతున్నారు జనం. అదే… పెట్రోల్ కల్తీ గురించి చెప్పేది. పెట్రోల్ లో వేరే ఏదైనా ఆయిల్ కలిపితే గుర్తుపట్టలేం కానీ ఏకంగా వీళ్లు నీళ్లే కలిపేస్తున్నారు. దాంతో వాహనాలు ఆగిపోయి వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో ఈ దారుణ పరిస్థితి తలెత్తింది. తానూర్ మండల కేంద్రం లోని దుర్గా పెట్రోల్ బంక్ లో శుక్రవారం వాహనదారులు పెట్రోల్ లో నీరు వస్తున్నాయని బంక్ వద్ద ఆందోళన చేశారు. వాహనాలలో పెట్రోల్ పోసుకొని కొద్దిదూరం వరకు వెళ్లి ఆగిపోవడంతో అనుమానం వచ్చి, వాహనల నుంచి పెట్రోల్ ను వాటర్ బాటిళ్లలో తీయడంతో సగ భాగం వరకు నీరు రావడంతో వాహనదారులు ఆందోళన చెంది పెట్రోల్ బంకు లో నిరసన వ్యక్తం చేశారు.
వాహన దారులు మాట్లాడుతూ తాము వాహనంలో పెట్రోల్ పొసుకోవడం జరిగిందని, పెట్రోల్ పోసుకొని కొద్దిదూరం వెళ్లడంతో వాహనం ఆగిపోయిందని, తమ వాహనం ఆగిపోవడంతో బాటిల్ లో పెట్రోల్ తీసి చూసే సరికి నీటితో కలిసిన పెట్రోల్ వచ్చిందని అన్నారు. తమకు వాహనాలు బాగు చేయించి ఇవ్వాలని అన్నారు. వాహదారుల ద్వారా సమాచారం తెలుసుకున్న తానూర్ తహశీల్ధార్ వెంకటరమణ అక్కడికి చేరుకుని బాటిల్ లలో పెట్రోల్, డీజిల్ శాంపుల్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంక్ లో కలుషితమైన పెట్రోల్ వస్తుందని సమాచారం రావడంతో అక్కడికి వచ్చి తనిఖీ చేయడం జరిగిందన్నారు. పెట్రోల్ బంక్ లోని లావాదేవీ రికార్డులు పరిశీలించి పెట్రోల్, డీజిల్ వేసిన రీడింగ్ ను రాసుకున్నారు. బాటిల్ లలో శాంపుల్ తీసుకుని బంక్ ను ముసివేయించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.