విజయనగరం జిల్లా లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలు, తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సమీక్షించారు.
ఈ సందర్బంగా పార్వతీపురం డీఎస్పీ సుభాష్ , ఏజెన్సీ పోలీసు స్టేషన్ల సీఐలు ఎస్ఐలతో ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ ఏజెన్సీ పోలీసు స్టేషన్లలో పటిష్టమైన భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలలో మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
అలాగే కమ్యూనిటీ పోలీసింగు కార్యక్రమాలను నిర్వహించి, గిరిజనులు, యువతకు పోలీసులు మరింత చేరువ కావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు గిరిజనులకు సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలని, గిరిజన విద్యార్ధులు శ్రద్ధ గా చదువుకొని, ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకొనే విధంగాను ప్రోత్సహించాలన్నారు.
క్రీడల్లో రాణించే గిరిజన యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు క్రీడా సామగ్రిని సమకూర్చాలన్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత మహిళలకు, విద్యార్ధినిలకు దిశ యాప్ పట్ల అవగాహన కల్పించాలన్నారు.
గిరిజన బాలికల రక్షణకై బాలిక మిత్ర గురించి అవగాహన కల్పించాలన్నారు. పోలీసు సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించి గిరిజనులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశించారు.
ఈ సమావేశంలో పార్వతీపురం ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ఎల్విన్ పేట ,సీఐ టి.వి. తిరుపతిరావు, సాలూరు సిఐ ఎల్.అప్పలనాయుడు, ఏజెన్సీ పోలీసు స్టేషన్ల ఎస్ఐలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.