కడప జిల్లా జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శనివారం నార్పల శివగుర్విరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ శివగుర్విరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ణతలు తెలియజేస్తూ, రైతుల సంక్షేమానికి పని చేస్తానని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కాయన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గములో మాత్రమే రెండు మార్కెట్ కమిటీ లు ఉన్నాయని రాష్ట్రములో మరెక్కడా లేవనీ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జమ్మలమడుగు పై ఎంతో ప్రేమ ఉంది కాబట్టే రెండు మార్కెట్ కమిటీ లు ఇచ్చారన్నారు.
అనంతరం వైస్ చైర్మన్ మనోహర్ యాదవ్, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రత్నరాజ్ తదితరులు పాల్గొన్నారు.