సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులను కార్యక్రమానికి పిలవలేదని గొడవ జరుగుతూ ఉంటుంది. అయితే అదేమిటో గానీ కొల్లాపూర్ లో అధికారులనే కార్యక్రమానికి పిలవకుండా అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ నాయకులు పూర్తి చేసేశారు. కొల్లాపూర్ మార్కెట్ యార్డులో జిల్లా లోనే మొదటి సారిగా వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షురాలు గాదెల సుధారాణి, జెడ్పిటిసి జూపల్లి భాగ్యమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ రఘుపతి రావు ఇతరులు హాజరయ్యారు. అయితే ఇక్కడ ఈ ప్రజా ప్రతినిధులకు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తుకు రాలేదు. మొత్తానికి వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందిస్తూ పనిచేస్తూ, ప్రభుత్వం సంక్షేమాలను అందించే వ్యవసాయ శాఖ అధికారులు ఒక ఎమ్మెల్యే కే గుర్తురాలేదంటే ఒక్కసారి ఆలోచించాలి. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి ఆహ్వానించకున్నా, పెరిగిన టెక్నాలజీని బట్టి ఫోను అయినా చేసి పిలవచ్చు. ఫోన్ చేయడానికి సమయం లేకున్నా వాట్సాప్ అయినా చేయవచ్చు, మెసేజ్ అయినా పంపవచ్చు. అయితే ఇలాంటివేం చేయలేదు. జిల్లాలో మొదటిసారిగా వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు సొంతోషించాలి. అదే విధంగా అధికారులు కూడా ఉండాలి. వ్యవసాయ శాఖ మంత్రితోనే సంబంధాలు ఉన్నందున అధికారులతో పనేమిటి అనుకున్నారో ఏమో కాని మొత్తం మీద అధికారులను కార్యక్రమానికి పిలవకుండా మరిచిపోయారు. మరి రేపటి నుంచి ఈ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేది కూడా అధికారులు లేకుండానే చేసేస్తారా? వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలోనే వ్యవసాయ శాఖ అధికారులకు అవమానం జరిగితే ఇక ఎవరితో చెపాలి?
previous post
next post