ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, అమిత్ జోగీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి బుధవారం ప్రగతి భవన్ కు వచ్చిన అమిత్ జోగీ, సిఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాల పై లోతుగా చర్చించారు.
బిఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను ఆసక్తితో అధినేత సిఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం వున్నదని అభిప్రాయ పడిన అమిత్ జోగి., బిఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు.
అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేసారని సిఎం ను అభినందించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ కు అమిత్ జోగీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తన తండ్రి ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ కి బహూకరించారు. జనతా కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.