జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆరోపణలు పెచ్చుమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఎన్నికల్లో సున్నితమైన అంశాలను ఆయా పార్టీ అభ్యర్థులు లేవనెత్తుతుండడంతో అది కాస్త ప్రజల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ వైపు బీజేపీ సవాళ్ళు ప్రతిసవాళ్ళతో తూతూ.. మైమై అంటుండగా, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే రేంజ్లో కౌంటర్ అటాక్కు దిగుతోంది.
మతం పేరుతో బీజేపీ నాయకులు సమాజాన్నిచీల్చే కుట్ర చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఆరోపిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఓ మెట్టెక్కి ఉగ్రవాద సంస్థలాంటి వారితో కేసీఆర్కు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగించాయి.
ఇక మతపరమైన వ్యాఖ్యలను ఎవ్వరూ చేయడానికి వీల్లేదని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. కేటీఆర్ కూడా నిన్న జరిగిన సమావేశంలో ఎలాంటి సంఘవిద్రోహ శక్తులను ఉపేక్షించేది లేదని, భాగ్యనగర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ఎవ్వరినీ క్షమించబోమని ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పడంతో పోలీసులకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు గోచరిస్తుంది.
ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై అన్ని పార్టీల నేతల వెంట తమ ఇంటలిజెన్స్ను ఇప్పటికే పెట్టారని దీని ద్వారా ఆయా నేతల మాటల తూటాలను రికార్డింగ్ చేస్తూ కఠిన చర్యలకై సిద్ధమవుతున్నారు.
ఏది ఏమైనా ఈ ఎన్నికలలో 25 వేల మంది పోలీసు బందోబస్తు, మొబైల్ పార్టీలు, ఇంటలిజెన్స్ తదితర బలగాలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేస్తూ అణువణువూ శోదనకు పోలీసు శాఖ సిద్ధమైంది.