విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి మహిళా సంరక్షణ పోలీసులతో డీపీఓలో సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రతీ మహిళ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనే విధంగా చూడాలన్నారు. ఇందుకు గ్రామ వాలంటీర్ల సహాయం తీసుకోవాలన్నారు.
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ కి వెళ్ళి “దిశ యాప్” డౌన్ లోడు చేసుకోవాలి. డౌన్ లోడు చేసుకుని మొబైల్ నెంబరు ఎంటర్ చేయగానే ఫోనుకు ఒటిపి నెంబరు వస్తుందన్నారు. ఓటిపి నంబరును యాప్ లో నమోదు చేసి, పేరు, అడ్రస్, ప్రత్యామ్నాయ మొబైల్ నంబరు, అత్యవసర సమయంలో సంద్రించయే కాంటాక్ట్ నెంబర్లు తదితర వివరాలు నమోదు చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
మహిళలు ఆపద సమయంలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్ లో అత్యవసర సహాయం (ఎస్ఓఎస్) బటన్ నొక్కితే వారి ఫోను నంబరు, చిరునామా, వారున్న లొకేషన్ తో సహా వారి వాయిస్ తో పాటు 10 సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూం కు పంపేలా దిశా యాప్ ను రాష్ట్ర పోలీసుశాఖ రూపకల్పన చేసిందన్నారు.
కమాండ్ కంట్రోల్ రూం నుండి సంఘటనా స్థలంకు దగ్గరలో ఉన్న పోలీసు అధికారి ఫోను నంబరుకు సమాచారం అందించి, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే ప్రయత్నంను పోలీసులు చేస్తారన్నారు. ఈ విషయాలను మహిళలకు, విద్యార్థినులకు వివరించి ఎక్కువ మంది దిశ యాప్ ను డౌన్ లోడు చేసుకొనే విధంగా మహిళా సంరక్షణ పోలీసులు చర్యలు చేపట్టాలని, ఈ ప్రత్యేక డ్రైవ్ ను సంబంధిత పోలీసు అధికారులు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, దిశ డిఎస్పీటి. త్రినాధ్, ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, సీఐలు బి. వెంకటరావు,ఎన్.శ్రీనివాసరావు, జే.మురళి, సీఐ. లక్ష్మణరావు, టిఎస్ మంగవేణి, ఎర్రంనాయుడు, ఐసి చిట్టి, మహిళా సంరక్షణ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.