కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) ప్రతినిధి బృందం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరింది.
గురువారం నాడు బిఆర్కే భవన్ లో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం మంత్రి ఈటలను కలిసి జర్నలిస్టుల కరోనా కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. కరోనాతో మృతి చెందిన యువ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కరోనా పాజిటీవ్ వచ్చిన జర్నలిస్టులు కొలుకునేంతవరకు వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక చేయూత అందించాలని ప్రతినిధి బృందం కోరింది.
జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జర్నలిస్టుల ఆరోగ్య సేవల కమిటీ కన్వీనర్ ఏ.రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాములు వున్నారు.