విద్యనే రాష్ట్రానికి పెట్టుబడిగా భావిస్తున్నామని, అందుకోసమే సీఎం జగన్ విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలలో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం కోసం అనేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఒక విద్యార్ధి బాగా చదువుకొని అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ఆ విద్యార్ధి చదివిన పాఠశాల కు మంచి పేరు వస్తుందని, తద్వారా జిల్లాకు, రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుందని అన్నారు.
మన రాష్ట్రం లో విద్యా రంగం లో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల వారు కూడా రావడం మంచి పరిణామమని అన్నారు. ఈ మేరకు విజయనగరం లో చారిత్రక ప్రాశస్త్యం కలిగి ఉన్న కస్పా హై స్కూల్ లో జిల్లా స్థాయి ఆణిముత్యాల కు నగదు బహుమతులను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యా శాఖా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో , కళాశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు, పురస్కారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు తో సరికొత్త పథకానికి శ్రీ కారం చుట్టిందని అన్నారు.
ప్రతిభ కనపరిచిన విద్యార్ధుల నే కాకుండా వారి తల్లిదండ్రులను, వారికీ బోధించిన ఉపాధ్యాయులను కూడా సన్మానించడం ద్వారా మిగిలిన వారికీ స్ఫూర్తి కలుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇద్దరు విద్యార్ధులకు సమాన మార్కులు వస్తే నగదును పంచకుండా ఇద్దరికీ వేర్వేరుగా నగదు బహుమతిని అందజేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆణిముత్యం కావాలని విద్యార్ధులను ప్రోత్సహించడానికే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయిలో పోటీ జరుగుతోందన్నారు.
బై లింగువల్ టెక్స్ట్ బుక్స్ తో రెండు భాషల్లో తెలుగు, ఆంగ్లం ఒకే సారి బోధించడం జరుగుతోందని దీని వలన విద్యార్ధులు ఆంగ్ల భాష పై పట్టు సాధించగలరని అన్నారు. ఈ బోధన కు ఉపాధ్యాయులే ముఖ్యమని, చిత్త శుద్ధి తో విద్యార్ధులను తీర్చి దిద్ది సమాజ వికశానికి తోడ్పడాలని కోరారు. విద్య కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు భాగస్వామ్యులై విద్యభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనారు.
అంతకు ముందు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ పేదలకు, ధనికులకు తారతమ్యం లేకుండా అందరిని సమానంగా చూడాలనే విద్యా పరంగా అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారని అన్నారు. కుటుంభ యజమానికి పిల్లల్ని చదివించే భారాన్ని తగ్గించి తానూ ఆ భారాన్ని తీసుకున్నారని, అందుకే అమ్మ వొడి, విద్యా కానుక వంటి పధకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కంటి వెలుగు ద్వారా ప్రతి విద్యార్ధికి పరీక్షలు జరిపి అవసరమైన వారికీ కంటి అద్దాలను అందజేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్ధుల నమోదు పెరగడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలే కారణమని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష 45 వేల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక పధకం ద్వారా లబ్ది చేకురుతుందన్నారు.
పాఠశాలలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం నాడు నేడు ద్వారా మౌలిక వసతులను కల్పించామన్నారు. జిల్లాలో 392 పాఠశాలలలో స్మార్ట్ టి వి ల ద్వారా తరగతులు నిర్వహించడం జరుగుతోందన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం జగనన్నా గోరుముద్ద , రాగి జావ పధకాలను అమలు చేస్తూ విద్య లో ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా ప్రభుతం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం, మెరిట్ సర్టిఫికెట్, మెడల్ మరియు మెమెంటులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థి తల్లిదండ్రులను సత్కరించారు. పాఠశాల స్థాయి నియోజకవర్గ, జిల్లా స్థాయిలకు కలుపు కొని మొత్తంగా 46 లక్షల 2 8వేల రూపాయలు నగదుపురస్కారమును విద్యార్థులకు అందించడం జరిగింది.
10 వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి లో 10 వ తరగతి లో మొత్తం 330 మందికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఇంటర్మీడియట్ లో మొత్తం 1008 మందికి మొత్తం నిధులు 46 లక్షల 28,000 రూపాయలను అందజేశారు. మొదటి బహుమతి గాను 50,000, రెండవ బహుమతి గాను 30,000, తృతీయ బహుమతిగాను 15,000 అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, రాజం ఎంఎల్ఏ కంబాల జోగులు, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మయోర్లు, కర్పోరేటర్లు, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర రెడ్డి, అవార్డులు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.