సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తున్నది. ఇంతకాలం వ్యంగ్య రాజకీయ చిత్రాలు, ప్రముఖుల జీవిత చరిత్ర పేరుతో సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ పై ఇప్పుడు చిత్రాలు తీయడం మొదలైంది. సమాజంలో ఏ సంచలన విషయం జరిగినా నేరుగా దాని బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి చిత్రాలు తీసి సంచలనం సృష్టించడం రామ్ గోపాల్ వర్మకు అలవాటుగా మారింది.
రాజకీయ వ్యంగ్య చిత్రాల పేరుతో కొందరు రాజకీయ నాయకులపై కూడా చిత్రాలు తీసిన రామ్ గోపాల్ వర్మ విపరీతమైన పబ్లిసిటీ సంపాదించేవారు. ఇప్పటికే ఆయనపై ‘‘పరాన్న జీవి’’ అనే చిత్రం రూపొందింది. ఈ నెల 25న ఆ చిత్రం ఓటీటీలో ఆ చిత్రం విడుదల కాబోతున్నది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనల ఆధారంగా మరో చిత్రం రూపొందుతోంది.
తూర్పు గోదావరి జిల్లా కు చెంది, హైదరాబాద్ లో స్థిరపడ్డ వ్యాపారవేత్త ముత్యాల సత్తిబాబు నిర్మాతగా ఒక చిత్రాన్ని రూపొందించేందుకు శ్రీకారం చుట్టారు. భారతీ మూవీస్ పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘‘పులకేసి వర్మ’’ అని పేరు పెట్టినట్లు తెలిసింది.
అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని త్వరలో కరోనా నిబంధనల మేరకు షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలిసింది. కన్న కూతురితో ఛీ కొట్టించుకున్న ఒక రాజుగారి కథ ఇది అని సినీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం. జానపద చిత్రాల జోనర్ లో దీన్ని నిర్మిస్తున్నారు.