కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్న పోలీసులపై పెను ప్రభావం పడుతున్నది. నిన్న పోలీస్ కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనా వైరస్ కారణంగా మరణించగా నేడు మరో పోలీసు అధికారికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.
కుల్సుంపురా పోలీస్ స్టేషన్ లో కరోనా విధి నిర్వహణలో ఉన్న దయాకర్ రెడ్డి కి కరోనా వైరస్ సోకింది. దాంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ పోలీసులను నిర్ఘాంత పరచిన ఈ సంఘటన నుంచి తేరుకోక ముందే బాలాపూర్ కు చెందిన డిఐ సుధీర్ కృష్ణ కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది.
సుధీర్ కృష్ణ ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. దయాకర్ రెడ్డి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని పోలీసు కమిషనర్ ప్రకటించారు. విధి నిర్వహణలో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసులకు మనం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. పోలీసుల నైతిక స్థయిర్యాన్ని మనం అందరం కాపాడాల్సిన అవసరం ఉంది.