జులై మాసాంతానికి బస్వాపూర్ రిజర్వాయర్ కు కాళేశ్వరం జలాలు చేరుకుంటాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం బుధవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నాలుగు గంటల పాటు 40 కిలోమీటర్లు కాలువ గట్ల మీద పర్యటించారు.
ఆయన సాయంత్రం బసవపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్న చోటనే ఆలేరు శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,భోనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు మురళీధర్ రావు,హారేరామ్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బసవపూర్ రిజర్వాయర్ నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
త్వరితగతిన పూర్తి చేసి జులై మాసాంతానికి నీళ్లు అందిస్తామన్నారు. భూసేకరణ తో పాటు నిర్వాసితులకు పునరావాసం వంటి అంశాలపై సమీక్షించుకున్నామని అన్నింటిని పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.