మా సారు దేవుడు కరోనా అంటుకోదు అనే శీర్షికతో సత్యం న్యూస్ వెల్లడించిన అంశాలపై కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అత్యంత వేగంగా స్పందించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన భార్య అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చి నేరుగా ప్రజలతో కలిసిన వ్యవహారాన్ని సత్యం న్యూస్ సవివరంగా వెల్లడించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఎవరైనా ఎంతటి గొప్పోరైనా 14 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లోగానీ సొంతంగా ఇంట్లో ఒంటరిగా పరి శుభ్రంగాగానీ తమను తాము క్వారంటైన్ చేసుకోవాలి.
ఇదే కదా నిన్న తెలంగాణ సిఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది. అయితే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాత్రం అవేవీ పాటించలేదు. విమానం దిగి నేరుగా రైలెక్కారు. రైలు దిగి నేరుగా ప్రజల మధ్య లోకి వెళ్లిపోయారు. మంగళవారంనాడు వచ్చిన ఆయన బుధవారం నాడు కాగజ్ నగర్ మునిసిపల్ బడ్జెట్ సమావేశానికి వచ్చేశారు.
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశానికి హాజరైన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అక్కడ చైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ తిరుపతి, ఇతర అధికారులతో చేతులు కలిపి మాట్లాడారు.
వీరే కాదు కాగజ్ నగర్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు అందరూ సార్ కు చేతులు కలిపారు. అనంతరం రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం లో పాల్గొన్నారు.
అదీ కూడా సతీ సమేతంగా. ఇంకా ఇలా చెబుతూ పోతే సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మందిని కలిసిన సంఘటనలు చానా ఉన్నాయి. అంటూ సత్యంన్యూస్ కథనాన్ని సచిత్రంగా పోస్టు చేసింది.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన భార్య కె రమాదేవి లను ఇంట్లోనే 14 రోజులు ఉండాలని, బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సత్వర చర్యలు తీసుకుని కోనేరు కోనప్పను ఆయన ఇంటిలోనే ఐసోలేషన్ లో ఉంచారు.