ఎన్నో ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు తిరిగి వచ్చిన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. తన క్యాడర్ రాష్ట్రానికి అంకిత భావంతో సేవ చేసేందుకు చీఫ్ సెక్రటరీగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న నీలం సాహ్నీకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తీరుతో ఆమె విసిగిపోయి ఉన్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కారణంగానే గత చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం అత్యంత అవమానకర రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది.
తన మాటే ముఖ్యమంత్రి మాట, ముఖ్యమంత్రి మాటే తన బాట అనే విధంగా ప్రవీణ్ ప్రకాశ్ ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు గతంలో వినిపించాయి. ఈ ప్రవర్తన కారణంగానే ఎల్ వి సుబ్రహ్మణ్యం ఎదురు తిరిగారు. అత్యంత సీనియర్ అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అతి దారుణంగా ఆయనను పదవి నుంచి తొలగించుకున్నారు.
ఆ నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐ ఏ ఎస్ అధికారులలో ఏదో ఒక రకమైన భయం మొదలైంది. చీఫ్ సెక్రటరీనే అత్యంత దారుణంగా తెలిగిస్తే తమ సంగతేమిటని వారు లోలోపలే మదన పడ్డారు. అయితే ఆ స్థానంలోకి వచ్చిన నీలం సాహ్నీ అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో వారిలో భరోసా ఏర్పడింది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్న ఏకవాక్య ఆదేశాలు ఆమెను చీకాకు పెడుతున్నాయి.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు తప్ప చర్చలకు ఆస్కారం లేకపోవడం కూడా అత్యంత సీనియర్ అయిన నీలం సాహ్నీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఆమె ఇప్పటికే తీసుకువచ్చారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్పారో మాత్రం తెలియలేదు.