కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమ్ము విజయరాజు అన్నారు. లాక్ డౌన్ ఉపయోగించుకొని యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతునాయని ఆయన ఆరోపించారు.
ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి, ఇది ఒక జ్వరం లాంటిది, ఇది ఏమీ చెయ్యదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుందని తేలికపాటి మాటలు మాట్లాడి ప్రజల్ని మరింత నిరాశ పరుస్తున్నారని ఆయన అన్నారు. కరోనా ఎక్కడికి పోదు, దీనితో మనం భవిష్యత్తులో సహజీవనం చేయవలసిన అవసరం ఉంది అని చెప్పడం విడ్డూరంగా ఉందని విజయరాజు అన్నారు.
ఈ కరోనా ఉధృతిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి, ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని తాపత్రయపడటం, ఎన్నికల కమిషనర్ ని మార్చి ఇతర రాష్ట్రాల నుంచి కొత్త కమిషనర్ ని వెయ్యటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల ప్రాణాలు ప్రజలే కాపాడుకోవాలని అందుకోసమే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చింది అందుకేనని ఆయన అన్నారు.
వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేద ప్రజలకు ఉచిత భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా, కరోనా బారిన పడి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, వడ్డెర కార్మికులు, పల్వరైజింగ్, సున్నపు బట్టి లలో పనిచేసే కార్మికులు, రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రోజుకు రూ.500 చొప్పున రాబోయే మూడు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.