రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడం, 65 సంవత్సరాల పైబడిన వ్యక్తికి పదవి కట్టబెట్టడం రాజ్యాంగంలోని 217 నిబంధనకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ కేసులో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కామినేని శ్రీనివాస్ తరఫున కౌంటర్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు టాస్క్ఫోర్స్ నియమించిందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఈ టాస్క్ఫోర్స్ సూచనలను రాష్ట్రం ఆమోదించిందని ఆయన అన్నారు. దాని ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఐదు సంవత్సరాల పదవీకాలం తప్పనిసరిగా ఉండాలన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదని నిబంధనను కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్కు 65 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు ఉటంకించారు.
ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం కేంద్రం ఆమోదించిన టాస్క్ఫోర్స్ నిబంధనలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పూర్తి విరుద్ధం అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ను తొలగించడం, కాల పరిమితిని కుదించడం అనేది 217 నిబంధనను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. వయసును పేర్కొనకుండా సవరణకు తీసుకురావటం.. 65 సంవత్సరాలు పైబడిన వారిని ఎన్నికల కమిషనర్గా నియమించడం ఎన్నికల సంస్కరణల కిందకు రాదన్నారు. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మినిస్టీరియల్ పోస్ట్ చేయటం మంచిది కాదన్నారు.