వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసు విచారణ జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకే చీకాకు తెప్పించిన సంఘటన నేడు జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఎన్.రమేష్ కుమార్ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అనుమతించినవారు కాకుండా ఇతర న్యాయవాదులు ప్రవేశించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. కేవలం 10 మందికి పాస్ వర్డ్ ఇస్తే, ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్ లోకి ఎలా వచ్చారన్న ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. పాస్వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే ఆగ్రహం వ్యక్తం చేసారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే క్రాస్టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. రమేశ్ కుమార్ తొలగింపు పిటిషన్పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు తిరిగి ప్రారంభం కాగా ఈ సంఘటన జరిగింది.
నిన్న ఆరుగురు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనం, ఇవాళ మరికొందరు పిటిషనర్ల తరపు వాదనలు వినటానికి రెడీ అయ్యింది. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు ప్రారంభించారు. అయితే, ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ పాస్వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బయట వ్యక్తులు ఎలా వస్తారు అంటూ చర్చ మొదలైంది.