నలుగురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల సీమా హైదర్ జఖ్రానీ పాకిస్తాన్ నుంచి అక్రమ మార్గం ద్వారా పారిపోయి వచ్చి నోయిడాలోని తన ప్రియుడితో ఉన్న సంఘటన ఇప్పుడు పాకిస్తాన్ లో మతకలహాలు రేపుతున్నది. పాకిస్తాన్ లోని మతమౌఢ్యులు అక్కడి హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ కాష్మోర్ ప్రాంతంలోని హిందూ దేవాలయంపై కొందరు ఆదివారం రాకెట్ లాంచర్తో దాడి చేశారు.
కొన్ని రోజుల క్రితం, కాష్మోర్, ఘోట్కీ ప్రాంతాలలోని దేవాలయాలపై కూడా ఇలాంటి దాడులే జరిగాయి. 2019లో ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివశించే 22 ఏళ్ల సచిన్ మీనా పాకిస్తాన్ కు చెందిన నలుగురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల సీమాతో ఆన్ లైన్ గేమ్ ద్వారా పరిచయం అయింది. అక్కడ సచిన్ కిరాణా దుకాణం నడుపుతున్నాడు.
సీమా తన ప్రియుడిని కలిసేందుకు తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆమెను జూలై 4న అరెస్టు చేయగా, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సీమా జఖ్రాణి చేసిన పని పాకిస్తానీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసింది. దాంతో ముస్లిం మత పెద్దలు సింధ్లో హిందువులను, హిందూ దేవాలయాలను టార్గెట్ చేశారు.