తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు శాసన సభ్యులు రసమయి బాలకిషన్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు రేలారే ప్రసాద్ అన్నారు. మాన కొండూరు నియోజకవర్గంలో ప్రగతికి బాటలు వేస్తూ అన్ని వర్గాల ప్రజల కు చేరువ అవుతున్నందు వలనే ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గద్వాల జిల్లా సారథి కళాకారులు పాల్గొని ఈ దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుడు అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోలేకనే ఈ విధంగా కాన్వాయ్ పై రాళ్లు మరియు కర్రలతో దుండగులు దాడి చేశారని వాపోయారు. సమాజంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఆ స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి కాని భౌతిక దాడులకు దిగరాదని వారు తెలిపారు. ఇదే విధంగా దాడులకు పూనుకుంటే కళాకారులగా పాట, మాట, ఆటలతో దుండగులపై ప్రతిదాడి కైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కి కళాకారుల పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా కళాకారులు రేలారే ప్రసాద్, కేశవులు, డప్పు నరసింహా, స్వామి,రాహుల్,
సికిందర్ , క్రిష్ణ, శైలజ, రమాదేవి, కవిత, భూపతి, హజరత్ మొదలగు కళాకారులు పాల్గొన్నారు.