రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వున్న గ్రానైట్ పరిశ్రమలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా ఆయా కంపెనీ లపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ కోణంలో ఈడీ సోదాలు నిర్వహించిందని అంతా అనుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగానే గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించామని తమ ప్రకటనలో ఈడీ అధికారులు వెల్లడించడం గమనార్హం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 మే 29న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అప్రైజల్ నివేదిక నంబరు 6(సి.నెం.268/ఎన్ఆర్/2013) ప్రకారం 7,68,889.937 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు ప్రకటనలో ఈడీ వెల్లడించింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎగవేసిన సీనరేజ్ ఫీజు రూ. 124,94,46,147. ఎగవేసిన పెనాల్టీ రూ. 624,72,30,735 రెండు కలిపి మొత్తం రూ. 729,66,76,882గా తేల్చింది. అప్పటి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
కరీంనగర్లోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సముద్ర మార్గంలో రవాణా చేసిన గ్రానైట్ బ్లాకులపై పెద్ద ఎత్తున సీనరేజ్ ఫీజు ఎగవేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ నివేదిక మేరకు అక్రమ గ్రానైట్ మైనింగ్, ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. సముద్రం, రైలు మార్గాల్లో అక్రమంగా తరలించిన గ్రానైట్ సంబంధించి రాయల్టీ చెల్లించాలని పలు మార్లు కోరినా ఎగుమతిదారులు చెల్లించలేదని ఈడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రానైట్ వ్యాపారాల్లో ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత గ్రానైట్ సంస్థలకు విధించిన జరిమానా వసూలు విషయం పట్టించుకోవడం లేదంటూ పలువురు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోపాటు ఇతర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. దీంతో ఈడీ మరోసారి గ్రానైట్ సంస్థలపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.